అన్ని మెడికల్ టెస్ట్ లు ఉచితం : సీఎం కేసీఆర్

తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. ప్రజలకు వైద్యం రాను రాను అత్యంత ఖరీదుగా మారిందని, పేదలకు జబ్బు చేస్తే నయం చేయించుకోవడానికి ఆస్తులు అమ్ముకునే పరిస్థితి వచ్చిందని సీఎం కేసీఆర్ అన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వ ఆధ్వర్యంలో డయాగ్నోస్టిక్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వాస్పత్రుల్లో డాక్టర్ పరీక్ష చేసి మందులు రాస్తాడు కానీ ప్రైవేట్ సెంటర్లకు వెళ్లి వేల వేలు ఖర్చు చేయాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వ డయాగ్నోస్టిక్‌ సెంటర్లలో 57 పరీక్షలు ఉచితమని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు మెరుగైన వైద్యం అందిచేందుకు, అన్నిరకాల వైద్యసేవలను మరింతగా అందుబాటులోకి తేవడమే ప్రభుత్వ లక్ష్యం అని సిఎం అన్నారు.

కరోనా వంటి వ్యాధుల నేపథ్యంలో , రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సహా పలు ఇతర ప్రభుత్వ దవాఖానాల్లో మౌలిక వసతులను మెరుగుపరిచామన్నారు. ప్రజలకు ఉచిత వైద్యకోసం ఇప్పటికే పలు పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నదన్నారు. సామాన్యుడికి వైద్యాన్ని మరింతగా అందుబాటులోకి తెచ్చి ఆరోగ్య తెలంగాణను తీర్చిదిద్దుతున్న తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా మరో ముందడుగు వేస్తుందన్నారు.