దేవినేని ఉమా పై మరో కేసు..?

రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకూ మారిపోతున్నాయి. తాజా రాజకీయ పరిస్థితులు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి దేవినేని ఉమాపై కేసు నమోదైంది. కరోనా రూల్స్ బ్రేక్ చేశారంటూ ఆయనపై కేసు నమోదు చేశారు. కృష్ణా జిల్లా మైలవరం పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు. జూన్ 16న మైలవరంలోని అయ్యప్ప నగర్‌లో దేవినేని ఉమా పర్యటించారు. ఆ సమయంలో ప్రభుత్వ ఇళ్ల స్థలాలను దేవినేని ఉమ పరిశీలిస్తుండగా ఆయన వెంట కార్యకర్తలు,జనాలు చాలా మంది పోగయ్యారు. దీంతో ఆయనపై కేసు నమోదైంది.

దేవినేని ఉమా కరోనా రూల్స్ బ్రేక్ చేసి లెక్కకు మించి జనాలను తీసుకోచ్చాడని, ఆయన నిబంధనలను ఉల్లంఘించినందుకుగాను కేసు నమోదుచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రభుత్వానికి సంబంధించి తప్పును ఎత్తిచూపినందుకు తనపై ఇలాంటి నిందలు మోపి కక్ష సాధిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమా తెలిపారు. పోలీసులు చేస్తున్న ఇటువంటి చర్యలు న్యాయమైనవి కాదని పేర్కొన్నారు. పోలీసులపై మైలవరం నియోజకవర్గ టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.