సినీ పరిశ్ర‌మ‌లో మ‌రో విషాదం..క‌రోనాతో ప్ర‌ముఖ న‌టుడు మృతి!

అతి సూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచ‌దేశాల‌ను అల్ల‌క‌ల్లోలం చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి కాటుకు సామాన్యులే కాదు ఎంద‌రో సినీ ప్ర‌ముఖులు కూడా మృత్యువాత ప‌డుతున్నారు. తాజాగా క‌న్న‌డ సినీ ప‌రిశ్ర‌మ‌లో మ‌రో విషాదం చోటు చేసుకుంది.

కన్నడ సీనియర్‌ నటుడు సురేష్‌ చంద్ర కరోనాతో మృతి చెందారు. ఈ మ‌ధ్యే క‌రోనా సోకిన ఆయ‌న బెంగుళూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయ‌న మృతితో క‌న్న‌డ చిత్ర ప‌రిశ్ర‌మ దిగ్భ్రాంతికి గురైంది. ప‌లువురు ప్ర‌ముఖులు సురేష్ మ‌ర‌ణంపై సంతాపం వ్య‌క్తం చేస్తున్నారు.

కాగా, సురేష్‌ నటించిన చెలువినా చిత్తారా, ఉగ్రమ్ సినిమాలోని పాత్రలు ఎప్పటికీ గుర్తుంటాయి. కిచా హుచ్చా, రానా, షైలూ, కాళిదాస కన్నడ మేష్త్రు, అప్పయ్య, జంగ్లీ వంటి పలు హిట్ చిత్రాలలో కూడా న‌టించి త‌న‌దైన ముద్ర వేసుకున్నారు.