కీర్తి సినిమాని అలా పక్కన పెట్టేసారేంటి..?

మహానటి సినిమా తర్వాత ఒక్కసారిగా ఎనలేని పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ముద్దుగుమ్మ కీర్తి సురేష్ ‘పెంగ్విన్’, ’మిస్ ఇండియా’ వంటి మహిళా ప్రాధాన్యత గల సినిమాల్లో నటించారు కానీ అవేమీ తనకు ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చి పెట్టలేదు. ఈ రెండు సినిమాల తర్వాత ఆమె “గుడ్ లక్ సఖి” అనే ఒక స్పోర్ట్స్ రొమాంటిక్ డ్రామాలో నటించారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ గత ఏడాదిలోనే పూర్తయ్యింది. నిజానికి ఈ చిత్రం గతేడాది లాక్ డౌన్ లోనే విడుదల కానుందని వార్తలు వచ్చాయి. కానీ 2020 పూర్తయ్యేంతవరకూ రిలీజ్ డేట్ ప్రకటించలేదు. ఈ ఏడాది మార్చి నెలలోపు కూడా సినిమా విడుదలకు చిత్రబృందం ఎటువంటి ప్లాన్స్ పెట్టుకోలేదు. అయితే సరిగ్గా 2 నెలల క్రితం జూన్ 4వ తేదీన సినిమాని రిలీజ్ చేస్తామని మూవీ యూనిట్ ప్రకటించింది. కానీ ప్రస్తుత కరోనా సంక్షోభంలో సినిమా రిలీజ్ చేయడం సాధ్యపడదు కాబట్టి మళ్లీ “గుడ్ లక్ సఖి” రిలీజ్ విషయంలో సందిగ్ధత నెలకొంది.

ఇప్పటికే ఓ ఏడాది గడిచిపోతుండగా కనీసం ఓటీటీ వేదికపైనైనా సినిమా విడుదల చేస్తారేమోనని కీర్తి ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాకి దర్శకుడు ‘హైదరాబాద్ బ్లూస్’, ‘తీన్ దీవారే’ వంటి వైవిధ్యమైన చిత్రాలను రూపొందించిన నగేష్ కుకునూర్ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనితో నిర్మాతలు థియేటర్లోనే విడుదల చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కీర్తి రెండు సినిమాలు ఓటీటీ వేదికగానే నేరుగా విడుదల అయ్యాయి కానీ అవి మంచి రెస్పాన్స్ పొందలేదు. దీంతో ఆమె సినిమాలకు ఓటీటీలో డిమాండ్ తగ్గిపోయినట్లు తెలుస్తోంది. దీనివల్ల మంచి డీల్స్ రాకపోవడంతో థియేటర్లలో రిలీజ్ చేసేందుకే దర్శకనిర్మాతలు వేచి చూస్తున్నట్టు సమాచారం.