నాగచైతన్య హీరోగా శేఖర్ కమ్ములు దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం లవ్ స్టోరీ. ఈ చిత్రంలో చైతుకు జోడీగా ఫిదా భామ సాయి పల్లవి నటించింది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో నారాయణదాస్ నారంగ్, పి. రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్లోనే విడుదల కావాల్సి ఉంది.
కానీ, కరోనా సెకెండ్ వేవ్ అడ్డు పడటంతో..విడుదలకు బ్రేక్ పడింది. అయితే ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుతుండడంతో ప్రభుత్వాలు లాక్ డౌన్ సడలింపులు ఇస్తున్నాయి. దీంతో అటు థియేటర్లు కూడా 50 శాతం ఆక్యూపెన్సీతో ఓపెన్ కానున్నట్లుగా తెలుస్తోంది. దీంతో లవ్ స్టోరీ త్వరలోనే విడుదల కానుందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా లవ్ స్టోరీ విడుదలపై మేకర్స్ పూర్తి క్లారిటీ ఇచ్చారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ ఎత్తివేసిన తర్వాతే లవ్ స్టోరీ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తామని చిత్ర నిర్మాత సునీల్ నారంగ్ తెలిపారు. అలాగే థియేటర్లలో రోజుకు 3 షోలను మాత్రమే అనుమతిస్తే.. సినిమా రిలీజ్ చేయాలని అనుకోవట్లేదని.. నైట్ కర్ఫ్యూ ఎత్తివేసిన తర్వాతే విడుదల గురించి ఆలోచిస్తామన్నారు.