బాహుబలికి షాక్ ఇచ్చిన శతమానం భవతి

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో బాహుబ‌లి సాధించిన విజ‌యం అలాంటిది..ఇలాంటిది కాదు. ఆ సినిమా విజ‌యం ఓ అసాధార‌ణ‌మైందిగానే చెప్పాలి. రూ.125 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా ఊహ‌ల‌కే అంద‌ని విధంగా రూ.600 కోట్ల వ‌సూళ్లు కొల్ల‌గొట్టింది. ఈ సినిమా నిర్మాత‌ల‌తో పాటు డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు ఊహించ‌ని లాభాలు తెచ్చిపెట్టింది.

అందుకు త‌గ్గ‌ట్టుగానే ఇప్పుడు బాహుబ‌లి-2 బిజినెస్ కూడా జ‌రుగుతోంది. తెలుగు సినిమా చ‌రిత్ర‌ను ప్ర‌పంచ‌వ్యాప్తంగా చాటిన బాహుబ‌లికే షాక్ ఇచ్చింది ఓ చిన్న సినిమా. అదే శ‌ర్వానంద్ హీరోగా న‌టించిన శ‌త‌మానం భ‌వ‌తి. ఈ సంక్రాంతికి తెలుగులో బాల‌య్య‌, చిరు లాంటి పెద్ద హీరోలతో పోటీప‌డి రిలీజ్ అయిన శర్వానంద్ శ‌త‌మానం భ‌వ‌తి ఈ సినిమా నిర్మాత దిల్ రాజుకు బాహుబ‌లిని మించిన భారీ లాభాలు తెచ్చిపెట్టింది.

బాహుబలి మొదటి భాగం నైజాం హక్కులను దిల్‌ రాజు 24 కోట్ల రూపాయలు చెల్లించి దక్కించుకున్నాడు. ఈ సినిమాకు అక్క‌డ భారీ వ‌సూళ్లే వ‌చ్చాయి. నిర్మాత‌ల షేర్ పోగా రాజుకు రూ.10 కోట్ల లాభం వ‌చ్చింది. ఓ ఏరియాకు ఓ సినిమాకు రూ.24 కోట్లు పెట్ట‌డం అంటే చాలా పెద్ద రిస్కే. అయినా రాజు భారీ రిస్క్ చేసి లాభం అందుకున్నాడు.

అయితే ఇప్పుడు రాజు కేవ‌లం రూ. 9 కోట్లతో తెర‌కెక్కించిన శ‌త‌మానం భ‌వ‌తి సూప‌ర్ హిట్ అయ్యింది. ఈ సినిమా ఇప్ప‌టికే రూ.30 కోట్ల షేర్‌కు ద‌గ్గ‌ర‌వుతోంది. సో ఇప్పుడు ఈ సినిమాకు పెట్టిన పెట్టుబ‌డితో పోల్చుకుంటే రాజుకు రెండు రెట్లు లాభం తెచ్చిన‌ట్ల‌య్యింది.  ఈ లెక్క‌న దిల్ రాజుకు శ‌త‌మానం భ‌వ‌తి బాహుబ‌లిని మించిన విజ‌యాన్ని ఇచ్చిన‌ట్లే క‌దా..!