పవర్స్టార్ పవన్కళ్యాణ్ స్టామినా ఏంటో ఆయన తాజా సినిమా మరోసారి స్పష్టం చేస్తోంది. పవన్కు ఎన్ని ప్లాపులు వచ్చినా క్రేజ్ తగ్గలేదని నిరూపిస్తోంది. పవన్కు అత్తారింటికి దారేది సినిమా తర్వాత సరైన హిట్ లేదు. గోపాలా..గోపాలా యావరేజ్. సర్దార్ గబ్బర్సింగ్, కాటమరాయుడు సినిమాలు రెండూ డిజాస్టర్లు అయ్యాయి. ఈ రెండు సినిమాల దెబ్బతో బయ్యర్లు భారీ నష్టాలు చూశారు. అయినా పవన్ తాజా సినిమాను భారీ రేట్లు పెట్టి అప్పుడే కొనేస్తుండడం ట్రేడ్ వర్గాలకు సైతం దిమ్మతిరిగే షాక్ ఇస్తోంది.
తాజాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ నటిస్తోన్న సినిమా బిజినెస్ పరంగా అప్పుడే రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా రైట్స్ కోసం సీడెడ్ నుంచి కళ్లుచెదిరే ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. ఈ సినిమా సీడెడ్ రైట్స్ కోసం ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రూ. 16 కోట్లు ఆఫర్ చేసిందట.
ఈ సినిమాకు సంబంధించి చిన్న స్టిల్గాని, పోస్టర్గాని, టైటిల్గాని ఇంకా బయటకు రాకుండానే ఈ రేంజ్లో ఆఫర్ రావడం విశేషం. సీడెడ్లో బాహుబలి 2 తర్వాత ఇదే పెద్ద ఫిగర్. దీంతో పవన్ మానియా ఎలా ఉందో మరోసారి స్పష్టమైంది. ఇక ఓవరాల్గా చూస్తే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.120 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది.
పవన్ సరసన అను ఎమ్మాన్యుయేల్, కీర్తి సురేష్ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమాకు కోలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నారు.