ఆర్కె.నగర్ లో ఎవరు గెలిచినా సంచలనమే…!

త‌మిళ‌నాడులో ఆర్కే.న‌గ‌ర్ స్థానానికి జ‌రుగుతోన్న ఉప ఎన్నిక త‌మిళ‌నాడు రాజ‌కీయ చ‌రిత్ర‌ను మార్చ‌బోతుందా ? అస‌లు ఇక్క‌డ ఎవ‌రు గెలుస్తారు ? అన్న‌ది పెద్ద టెన్ష‌న్‌…టెన్ష‌న్‌గా ఉంది. దివంగ‌త మాజీ సీఎం జ‌య‌ల‌లిత మృతితో ఖాళీ అయిన ఈ స్థానానికి ఉప ఎన్నిక జ‌రుగుతోంది. ఇక్కడ నుంచి పోటీ విషయంలో తమిళనాడురాజకీయ వర్గాలు చాలా ఉత్సాహంతో రంగంలోకి దిగాయి. జ‌య‌ల‌లిత మేన‌కోడులు దీప సైతం పోటీ చేస్తుండ‌డంతో ఎవ‌రు గెలుస్తారు ? అన్న‌ది పెద్ద స‌స్పెన్స్‌గానే ఉంది.

ఇక్క‌డ జ‌య సెంటిమెంట్‌ను వాడుకుని దీప గెలిస్తే ఓ సంచ‌ల‌న‌మే అవుతుంది. అలా కాకుండా ప‌న్నీర్‌సెల్వం నిల‌బెట్టిన మ‌ధుసూద‌న్ గెలిస్తే మ‌రో సంచ‌ల‌నం. వీరిద్ద‌రు కాకుండా డీఎంకే విజయం సాధిస్తే అంత కన్నా సంచలన మ‌వుతుంది. ఇక వీరు కాకుండా జైలులో ఉన్న చిన్న‌మ్మ శ‌శిక‌ళ అక్క కొడుకు టీటీవీ దినకరన్ గనుక విజయం సాధిస్తే.. అది తమిళనాడు రాజకీయాలనే మరో మలుపు తిప్పే అంశం అవుతుంద‌న్న చ‌ర్చ‌లు అప్పుడే స్టార్ట్ అయ్యాయి.

ఈ ఉప ఎన్నిక‌ల్లో దిన‌క‌ర‌న్ విజ‌యం సాధిస్తే ఆయ‌న త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి పీఠం అధిష్టించేందుకు అంతా రంగం సిద్ధ‌మైన‌ట్టే క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం చిన్న‌మ్మ శ‌శిక‌ళ ఆశీస్సుల‌తో త‌మిళ‌నాడు సీఎంగా ప‌ళ‌నిస్వామి ఉన్నారు. ఆయ‌న విశ్వాస ప‌రీక్ష‌లో నెగ్గేందుకు చిన్న‌మ్మ రాజ‌కీయ వ్యూహ‌మే అన్న విష‌యం ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ప‌ళ‌నిస్వామి చిన్న‌మ్మ‌కు కేవ‌లం న‌మ్మిన బంటు మాత్ర‌మే.

అదే దిన‌క‌ర‌న్ అయితే స్వ‌యానా అక్క కొడుకు ..ఇక్క‌డ దిన‌క‌ర‌న్ గెలిస్తే పళని సామిని శశికళ కచ్చితంగా పక్కన పెట్టే అవకాశం ఉంది. త‌న సొంత‌వాడైన దిన‌క‌ర‌న్‌ను అంద‌లం ఎక్కించ‌వ‌చ్చు. ఏదేమైనా ఆర్కే.న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల త‌మిళ‌నాడులో ఎలాంటి సంచ‌ల‌నాల‌కు దారి తీస్తుందో మాత్రం త‌మిళ రాజ‌కీయ నాయ‌కులు సైతం ఎవ్వ‌రూ అంచ‌నాకు రాలేక‌పోతున్నారు.