తమిళనాడులో సీఎం సీటు కోసం జరుగుతున్న రసవత్తర పోరులో రోజుకో సంచలన విషయం వెలుగు చూస్తోంది. ప్రస్తుత ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వం.. జయ మరణంపై అనుమానాలున్నాయంటూ పేల్చిన బాంబు బాగానే పేలింది. తమిళ ప్రజలు దీనిపై విచారణ జరిపించాలని ఆయనను కోరుతుండడం ఆయనకు హర్షాన్ని నింపింది. చిన్నమ్మను బాగా దెబ్బతీశానని ఆయన సంబరపడుతున్నారు. అయితే, అదే సమయంలో సీఎం సీటు తననేదని వాదిస్తున్న శశికళ.. పన్నీర్కు అదేస్థాయిలో కౌంటర్ ఇచ్చేందుకు రెడీ అయింది.
ఈ నేపథ్యంలోనే అన్నాడీఎంకేని చీలుస్తున్నాడంటూ పన్నీర్పై కొన్నాళ్లుగా ఆమె విరుచుకుపడుతోంది. విపక్ష డీఎంకేతో పన్నీర్ సెల్వం చేతులు కలిపి.. అన్నాడీఎంకేని చీల్చాలని పన్నాగం పన్నాడని ఆమె ఆరోపిస్తున్నారు. తాజాగా మీడియాతో మాట్టాడిన శశికళ.. జయలలిత మరణించిన రోజే పన్నీర్ పార్టీని చీల్చేందుకు కుట్ర పన్నాడని, కానీ, తానే పార్టీని కాపాడుతున్నానని చెప్పారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘జయలలిత మరణించిన రోజు రాత్రి.. దాదాపు అప్పుడు అర్థరాత్రి కావస్తోంది. అప్పుడే పార్టీలో చీలిక తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు నాకు అర్ధమయ్యింది. అదేరోజు రాత్రి నేను ఐదుగురు మంత్రులతో మాట్లాడాను. వెంటనే ఒక నూతన ముఖ్యమంత్రితో ప్రమాణ స్వీకారం చేయించాల్సిన అవసరం ఉందని నిర్ణయించాం. నూతన మంత్రివర్గం అవసరమైనప్పటికీ… పన్నీర్ సెల్వం సహా ప్రభుత్వంలో, మంత్రివర్గంలో ఎలాంటి మార్పులు చేపట్టదల్చుకోలేదు. అదేరోజు గవర్నర్తో సమావేశమయ్యేందుకు నేను ఆయన అపాయింట్మెంటు కోరాను. అమ్మ ఆశయాలను ముందుకు నడిపించడమే అప్పడు నాముందున్న ఏకైక లక్ష్యం’’ అని శశికళ వెల్లడించారు.
తనకు అధికార కాంక్ష లేదనీ… తమిళనాడు ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వంకు తానే స్వయంగా బాధ్యతలు అప్పజెప్పానని పేర్కొన్న శశికళ.. పన్నీర్ సెల్వం నీచమైన రాజకీయాలు చేస్తూ పార్టీని చీల్చేందుకు డీఎంకేతో చేతులు కలిపారని విమర్శించారు. అందుకే తాను పార్టీని చేతుల్లోకి తీసుకుని, సీఎం అవ్వాలని ప్రయత్నిస్తున్నట్టు వివరించారు. మొత్తానికి ఈ పరిణామం రాష్ట్రంలో కాక పుట్టిస్తుందని అందరూ అనుకుంటున్నారు. కానీ, విశ్లేషకులు మాత్రం.. ప్రజలు శశికళ వాయిస్ను పెద్దగా పట్టించుకోవడం లేదని భావిస్తున్నట్టు పేర్కొంటున్నారు. మరి ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో చూడాలి.