జనసేనాని టార్గెట్ ఏంటి? ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంపై కేంద్రంలోని మోడీనా? లేక ఏపీ సీఎం చంద్రబాబా? అంటే..పూర్తిగా పవన్ లక్ష్యం మోడీనే అనే టాక్ వినిపిస్తోంది. ఏపీలో ప్రత్యేక హోదా ఉద్యమం ఇప్పుడు యువత చేతిలోకి వెళ్లింది. తెలంగాణలోనూ ప్రత్యేక రాష్ట్రం ఉద్యమం యువత చేతిలోకి వెళ్లినట్టే.. ఇప్పడు ఏపీలో హోదా ఉద్యమాన్ని యువత తమ చేతుల్లోకి తీసుకున్నారు. దీనికి పవన్ మద్దతు పలికారు. అయితే, ఆయన ఈ సంరద్భంగా చేసిన ట్వీట్ అందరినీ ఆశ్చర్యంలో ముంచెంది. పవన్ తన ట్వీట్లో దేశ్ బచావో అని ఆవేశంతో ఊగిపోతున్న ఫొటో కనిపించింది.
ముమ్మాటికీ ఇది పవన్ కేంద్రంపై ముఖ్యంగా హోదా విషయంలో అడ్డం తిరిగిన ప్రధాని మోడీపైనేని అర్ధమవుతోందంటున్నారు విశ్లేషకులు. వాస్తవానికి గత ఎన్నికల్లో పవన్ కేంద్రంలోని బీజేపీకి కూడా మద్దతు పలికాడు. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారంలో మోడీ పక్కన సీటు పంచుకుని మరీ ప్రచారం చేశాడు. అయితే, అధికారంలోకి వచ్చాక మోడీ తన మాట నిలబెట్టుకోక పోగా ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో యూటర్న్ తీసుకోవడంపై పవన్ ఫైరయ్యారు. అంతేకాదు. గతంలో ఎన్టీఆర్ తరహాలో తెలుగువారిని ఉత్తరాది వారు అవమానిస్తున్నారనే వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఇప్పుడు ఇవే వ్యాఖ్యలు పవన్ ట్వీట్లతో పెద్ద ఎత్తున ఉండడంతో యువత ముఖ్యంగా వీటికే కనెక్ట్ అవుతున్నారు. దీనికితోడు గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన సాహిత్యం కూడా పవన్ వ్యాఖ్యలకు ప్రాణం పోసింది. దీంతో ఇప్పుడు పవన్ టార్గెట్ చంద్రబాబు కాదు.. మోడీయేనని అర్ధమైందంటున్నారు. కానీ, నిజానికి ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు కూడా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ, పవన్ మాత్రం మోడీనే లక్ష్యంగా రెచ్చిపోతుండడం గమనార్హం.