ఏపీలో హోదా ఉద్యమం కేంద్రానికి తలనొప్పిగా మారింది! ప్రస్తుతం జల్లికట్టు కోసం తమిళ యువత చేసిన స్ఫూర్తి.. ఏపీ యువతకు ఆదర్శంగా మారింది. ఇప్పుడు ఏపీ ప్రజలు హోదా కోసం చేస్తున్న ఉద్యమం.. హోదా కోరుతున్న రాష్ట్రాల్లోని నాయకులకు స్ఫూర్తిగా మారితే కేంద్రంపై మరింత ఒత్తిడి పెరుగుతుంది. దీంతో పాటు ఏపీకి హోదా ఇస్తామని మాట మార్చిందని, ఇక తప్పని పరిస్థితుల్లోనే అప్పుడు బీజేపీతో జత కట్టామని టీడీపీ హ్యాండ్ ఇస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఈ రెండూ అంశాలు బీజేపీని ఇప్పుడు తీవ్రంగా వేధిస్తున్నాయి! దీంతో ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా వ్యవహరించాలని బీజేపీ నిర్ణయించింది.
2019 ఎన్నికల్లో రాజకీయ పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు! అందుకే మిత్రపక్షాలైన టీడీపీ-బీజేపీ నేతలు అంతర్గతంగా పావులు కదుపుతున్నారు. ముఖ్యంగా హోదా విషయంలో భవిష్యత్తులో టీడీపీ యూటర్న్ తీసుకోదని గ్యారెంటీ ఏంటి? ఏపీ ప్రజల ముందు తమను ముద్దాయిగా నిలబెడితే ఇక గత్యంతరం ఏమిటి? అనే అభిప్రాయం బీజేపీ నేతల్లో వ్యక్తమవుతోంది. దీంతో ఏపీలో వినిపిస్తున్న హోదా స్వరానికి వీలైనంత త్వరగా మంగళం పాడేయాలని కేంద్రం భావిస్తోంది. స్పెషల్ స్టేటస్ పదాన్నే లేకుండా, వినిపించకుండా, ఎక్కడా కనిపించకుండా ఉండేలా బడ్జెట్ ను రూపకల్పన చేస్తోంది.
ఒకవేళ ఆంధ్రాలో ఉద్యమం ఉగ్రరూపం దాల్చితే… అదే స్ఫూర్తితో మరికొన్ని రాష్ట్రాలూ ఇదే బాటలో కదం తొక్కే అవకాశం ఉంటుంది. తమిళనాట జల్లికట్టు ఉద్యమం ప్రభావం ఏపీ హోదాపై బాగానే పడింది కదా. ఇదే రిపీట్ కాకుండా ఉండాలంటే… 14వ ఆర్థిక సంఘం చెప్పినట్టుగా కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చే నిధుల్లో పెరిగిన శాతం గురించీ… ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రత్యేక పరిస్థితులను అర్థం చేసుకుని, కేంద్రం అందివ్వబోయే సాయం గురించి.. ఇలాంటి వాటి గురించే ఇకపై కేంద్రం మాట్లాడుతుంది. అంటే, ఆంధ్రాలో మరోసారి తెరమీదికి వస్తున్న ప్రత్యేక హోదా ఉద్యమానికి ఎలాంటి ఫలితం ఉండదని కేంద్రం ముందస్తుగానే సంకేతాలు ఇస్తున్నట్టుగా భావించాలి.