తమిళనాడు సూపర్స్టార్ రజనీకాంత్ పార్టీ ప్రకటన వెలువడిన వెంటనే అక్కడ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. రజనీ పార్టీలోకి ఇప్పటికే పలు రాజకీయ పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు చేరేందుకు రెడీగా ఉన్నట్టు వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఇక కోలీవుడ్లో సీనియర్ హీరోయిన్లు నమిత, మీనా కూడా తాము రజనీకి మద్దతుగా ఉంటామని ప్రకటన చేశారు. ఈ ప్రకటన ఇలా ఉండగానే ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ తమిళ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది.
రజనీ పార్టీ ప్రకటన వెలువడిన వెంటనే ఆ పార్టీలో చేరడానికి ఐదుగురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రెడీగా ఉన్న తెలుస్తోంది. అలాగే మాజీ ముఖ్యమంత్రి పన్నీర్సెల్వం, ముఖ్యమంతి ఎడపాడి పళనిస్వామి వర్గాలకు చెందిన పలువురు కార్య నిర్వాహకులు రజనీ వైపు చూస్తున్నట్లు సమాచారం.
ఇక వీరితో పాటు ప్రతిపక్ష డీఎంకే, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు రజనీతో సంప్రదింపులు జరపడానికి ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరు ఇప్పటికే రజనీతో మీట్ అయ్యేందుకు విశ్వప్రయత్నాలు జరుగుతున్నాయట. అయితే కాలా షూటింగ్ కోసం ముంబైలో మకాం పెట్టిన రజనీకాంత్ వీరెవరినీ కలవడానికి సుముఖం వ్యక్తం చేయడం లేదని తెలుస్తోంది.
రజనీ ఇప్పటికే ఓ షాకింగ్ ప్రకటన చేశారు. డబ్బు సంపాదనే ధ్యేయంగా ఉన్నవారు తనతో రావొద్దని రజనీకాంత్ బహిరంగంగానే చెప్పిన విషయం తెలిసిందే. ఇక రజనీ పార్టీలోకి అన్నాడీఎంకేకు చెందిన ముగ్గురు ఎంపీలు కూడా చేరడానికి చర్చలు జరుపుతున్నారట. ఏదేమైనా రజనీ పార్టీ పెట్టకముందే ఇన్ని సంచలనాలు నమోదవుతుంటే పార్టీ పెడితే తమిళనాడు పాలిటిక్స్ అతలాకుతలం కావడం ఖాయంగా కనిపిస్తోంది.