టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు బీజేపీపై ఆశలు లేవా ? కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో టీడీపీ దోస్తానా వచ్చే ఎన్నికల వరకు ఉంటుందా ? మధ్యలోనే కట్ అవుతుందా ? చంద్రబాబు 2019 ఎన్నికల్లో బీజేపీతో పొత్త లేకుండానే పోటీకి రెడీ అవుతున్నారా ? అంటే ఇలా ఎన్నో సందేహాలతో కూడిన ప్రశ్నలు ఏపీ రాజకీయాల్లో వినిపిస్తున్నాయి.
తాజాగా కేంద్రంలో జరుగుతోన్న రాజకీయ పరిణామాలను గమనిస్తుంటే ఏపీలో టీడీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకే కేంద్రంలో ఉన్న ఎన్డీయే సర్కార్ ప్రయత్నాలు చేస్తున్నట్టే కనిపిస్తోంది. చంద్రబాబు ఏం చెపితే దానికి ఊకొట్టే వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతిగా వెళ్లిపోవడంతో పార్టీ పరంగా కూడా ఇప్పుడు ఎవరితో మాట్లాడాలన్నా వీలులేని పరిస్థితి.
ఇక ఇప్పుడు ఏపీ బీజేపీ పగ్గాలు వెంకయ్య వైరి వర్గం చేతుల్లోకి వెళ్లిపోనున్నాయి. చంద్రబాబు వీళ్లతో మాట్లాడేందుకు అంత సుముఖంగా లేకపోవచ్చు. ఈ క్రమంలోనే టీడీపీతో బీజేపీ పొత్తు ఉంటుందా ? ఉండదా ? అన్న సందేహాలు కూడా అప్పుడే వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే బీజేపీకి జగన్ దగ్గరవుతున్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలను తనకు అనుకూలంగా మార్చుకుని బీజేపీకి మరింత చేరువయ్యేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు.
ఇలాంటి టైంలో వెంకయ్య ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకోవడం చంద్రబాబుకు పెద్ద దెబ్బే. ఈ క్రమంలోనే తనను ఒంటరి చేసేందుకు బీజేపీ అధిష్టానం వేస్తోన్న ఎత్తులను గమనిస్తోన్న చంద్రబాబు ఇకపై బీజేపీపై ఆధారపడకుండా సొంతంగానే పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీనియర్ నేతల ముందు చంద్రబాబు తన మనసులో మాట చెప్పారట.
ఒక వేళ బీజేపీ వచ్చే ఎన్నికల్లో ఎక్కువ సీట్లు కావాలని, లేదా ఇతరత్రా అంశాల్లో ఎలాంటి బెట్టు చేసినా బాబు బీజేపీతో పొత్తుకు కటిఫ్ చెప్పేసి, అవసరమైతే జనసేనతో కలిసి ముందుకు వెళ్లాలని యోచిస్తోన్నట్టు కూడా తెలుస్తోంది. ఏదేమైనా బీజేపీని బాబు పూర్తిగా నమ్మడం లేదన్నది వాస్తవం. మరి వచ్చే ఎన్నికల్లో ఏపీ రాజకీయం ఎలాగైనా మారే ఛాన్సులు ఉన్నాయి.