
2009 తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు పార్టీకి దూరంగా ఉంటున్నాడు ? జూనియర్ ఎన్టీఆర్ కాలిగోటికి కూడా లోకేష్ సరిపోడు… జూనియర్ ఎన్టీఆర్ అంటే లోకేష్కి ఎందుకు అంత భయం… లోకేష్కి జూనియర్ ఎన్టీఆర్కి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది… ఎన్టీఆర్ అంటే లోకేష్ భయం, జ్వరం, వణుకు… తాజాగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ని ఉద్దేశించిన చేసిన విమర్శలు ఇవి. అసలు ఇప్పుడు ఉన్నపళంగా వంశీకి ఆయనకు ఎందుకు గుర్తు వచ్చారు అనేది తెలియకపోయినా ఇక… పార్టీలో మాత్రం ఒక చర్చ జరుగుతోంది.
ఇక జూనియర్ ఎన్టీఆర్ పార్టీ కోసం పని చేసే అవకాశం లేదు, ఆయన ఉంటె లోకేష్ చేతిలో పార్టీ ఉండదు. ఇన్నాళ్లుగా సైలెంట్ గా ఉన్న ఎన్టీఆర్ వ్యవహారం ఇప్పుడు మళ్ళీ చర్చల్లోకి రావడంతో ఈ కీలక వ్యాఖ్యలు వినపడుతున్నాయి. పార్టీకి అవసరం ఉన్నప్పుడు తాను పని చేస్తానని చెప్పిన తారక్ ఇప్పటి వరకు ఎక్కడా కూడా కనపడలేదు. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ కష్టాలు పడుతోంది… నేను ఉన్నాను అని ముందుకి వచ్చి ఆయన అందించిన సహకారమూ లేదు. దీనికి అంతటికి కారణం లోకేష్ అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి.
2017 లో లోకేష్ మంత్రిగా పని చేసినప్పుడు హరికృష్ణ వచ్చారు. ఆ తర్వాత ఎన్టీఆర్తో కలిసి పని చేయడానికి తనకు ఇబ్బంది లేదని లోకేష్ చెప్పారు. అయితే 2014 ఎన్నికలకు ముందు నుంచే హరికృష్ణ ఫ్యామిలీని టోటల్గా పక్కన పెట్టేశారు. ఇక హరికృష్ణ మృతి తర్వాత ఆ కుటుంబాన్ని సానుభూతి కోసం చేరదీసే ప్రయత్నం జరిగింది. 2018 ఎన్నికల్లో తెలంగాణలోని కూకట్పల్లి నుంచి ఆయన సోదరి సుహాసిని నిలబడినా ఎన్టీఆర్ మాత్రం ఎక్కడా ప్రచారం చేయలేదు. కనీసం ఆయన సోదరుడు కళ్యాణ్ రామ్ కూడా ప్రచారం చేసిన సందర్భమూ లేదు.
2019 ఎన్నికల ప్రచారానికి ముందు బాలయ్య లాంటి వాళ్లు ఎన్టీఆర్ ప్రచారమే అవసరం లేదన్నట్టుగా మాట్లాడారు. ఇక ఎన్టీఆర్కు అత్యంత సన్నిహితుడు అయిన మంత్రి కొడాలి నాని వైసీపీలోనే ఉన్నారు. ఇక ఇప్పుడు మరో స్నేహితుడు వల్లభనేని వంశీమోహన్ కూడా వైసీపీ గూటికే చేరుతుండడంతో పాటు ఇప్పుడు టీడీపీలోకి వచ్చినా లోకేష్ కోసం పని చేయడం తప్ప అంతకు మించి ఆయనకు ఒరిగేదేం ఉండదు. పైగా ఇప్పుడు కష్టాల్లో ఉన్న టీడీపీ కోసం ఎన్టీఆర్ పని చేసేది భ్రమ అని టీడీపీ నాయకులే అంటున్నారు.