ఎమ్మెల్సీ ఎన్నికల్లో బాలయ్య పవర్ పనిచేసేనా?!

అనంత‌పురంలో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల వేడి రాజుకుంది. స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ స్థానం  ఖాళీ కానుంది. ప్ర‌స్తుతం స్థానిక సంస్థ‌ల త‌ర‌ఫున ఎమ్మెల్సీ స్థానం టీడీపీ చేతిలో నే ఉంది. మెట్టు గోవింద రెడ్డి స్థానిక సంస్థ‌ల త‌ర‌ఫున ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే, ఈయ‌న ప‌ద‌వీ కాలం ముగియ‌నుంది. దీంతో ఈ స్థానానికి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అయితే, స్థానిక సంస్థ‌ల్లో టీడీపీకి బ‌లం ఉండ‌డంతో ఈ స్థానంలో ఎవ‌రు నిల‌బ‌డ్డా గెలుపు ఖాయం. దీంతో టీడీపీలో ఇప్పుడు లెక్క‌కు మించి అభ్య‌ర్థులు ఈస్థానంపై క‌న్నేశారు. వీరిలో సీనియ‌ర్లు పార్టీ కోసం ఎంతో కొంత త్యాగాల‌కు సిద్ధ‌ప‌డ్డ వారు కూడా ఉండ‌డంతో  స‌ర్వ‌త్రా ఆస‌క్తి రేకెత్తిస్తోంది.

ముఖ్యంగా ఈ స్థానం కోరుకుంటున్న వారిలో తాడిపత్రికి చెందిన ఫయాజ్ బాషా, హిందూపురం మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘని పేర్లు ప్రస్తుతం ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఫయాజ్ బాషా 1995 ప్రాంతంలో తెలుగు యువత ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1999 నాటి మున్సిపల్ ఎన్నికల్లో ఛైర్మన్ అభ్యర్థిగా పోటీచేసి జేసీ ప్రభాకర్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. అప్పటినుంచి వివిధ హోదాల్లో పార్టీకి సేవలందిస్తున్నారు. దీంతో ఫయాజ్‌కి ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలని ఆ ప్రాంత నేతలు కోరుతున్నారు.

అదేస‌మ‌యంలో  హిందూపురం మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘని సీఎం చంద్ర‌బాబు వియ్యంకుడు బాల‌య్య కోసం త‌న సిట్టింగ్ స్థానాన్ని 2014లో ఆయ‌న‌కు అప్ప‌గించేశాడు. దీంతో ప్ర‌స్తుతం ఘ‌నీ ఖాళీగా ఉంటున్నాడు. ఈ నేప‌థ్యంలో బాల‌య్య త‌న‌కు రిక‌మెండేష‌న్ చేస్తాడ‌ని ఘ‌ని భావిస్తున్న‌ట్టు స‌మాచారం. ఇదే జ‌రిగితే.. ఘ‌ని గెలుపు ఖాయం. బాల‌య్య సిఫార్సును చంద్ర‌బాబు ఎట్టి ప‌రిస్థితిలోనూ తోసిపుచ్చేది ఉండ‌దు కాబ‌ట్టి.. ఖ‌చ్చితంగా ఘ‌ని ఎమ్మెల్సీ అయ్యేది ఖాయం. అయితే, 2014 ఎన్నిక‌ల అనంతరం బాల‌య్య‌, ఘ‌నిల మ‌ధ్య ఏవో ఘ‌ర్ష‌ణ‌లు త‌లెత్తాయ‌ని స‌మాచారం. అవి ప‌రిష్కారం అయ్యాయ‌ని కూడా తెలిసింది.

ఈ నేప‌థ్యంలో బాల‌య్య.. ఘ‌నికి ఎమ్మెల్సీ సీటు ద‌క్కేలా సిఫార్సు చేస్తాడ‌ని ఘ‌నికి మ‌ద్ద‌తిస్తున్న వాళ్లు భావిస్తున్నారు. ఇక‌, ఈ ప్లేస్ నుంచే  పార్టీలో సీనియర్‌ నేత అయిన వై.సుబ్రమణ్యం అలియాస్‌ గడ్డం సుబ్బు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నాడు. ఈయ‌న ప‌రిటాల ర‌వీంద్రకు అత్యంత స‌న్నిహితుడు. దీంతో త‌న‌కు ఏదో ఒక విధంగా ఎమ్మెల్సీ సీటు ఇప్పించాల‌ని ఆయ‌న మంత్రి సునీత‌పై ఒత్తిడి తెస్తున్నాడు. అలాగే జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ కేసీ నారాయణ, త‌న‌కు మ‌రో ఛాన్స్ ఇవ్వాల‌ని సిట్టింగ్ ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి కూడా ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నారు. మ‌రి ఈ నేప‌థ్యంలో బాల‌య్య సిఫార్సుతో ఘ‌ని మండ‌లిలో కాలు పెడ‌తారో లేదో చూడాలి.